తిరుపతి కేంద్రంగా టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు!

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి

విజయవాడ, మహానాడు: తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు భగం కలిగించేలా ఉన్నాయి.

కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే… తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా సీబీఐతో విచారణ జరిపించండి. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.