లోకేశ్ పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్న టీడీపీ-జనసేన-బీజేపీ సభ ఏర్పాట్లు

చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యవేక్షణలో ఈ సభా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభాస్థలి వద్ద ఇటీవలే పూజ కూడా నిర్వహించారు. అనంతరం, లోకేశ్ నేతృత్వంలో 13 కమిటీల సభ్యులు సభా ఏర్పాట్లలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానుండటంతో బ్లూబుక్‌ భద్రత నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ అధికారుల బృందం సభా ప్రాంగణంలోనే ఉండి నాయకులకు సూచనలిస్తోంది. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం 3 హెలీప్యాడ్లు సిద్దం చేస్తున్నారు.

బొప్పూడి సభకు 10 లక్షలమంది వస్తారన్న అంచనాతో సభా ప్రాంగణంలో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు రాత్రికల్లా సభా ప్రాంగణాన్ని తమకు అప్పగించాలని భద్రతా సిబ్బంది నాయకులకు సూచించారు. బొప్పూడి సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ రూట్ మ్యాప్ ప్రకటించనున్నారు.