ఏ కష్టమొచ్చినా సంప్రదించవచ్చు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
హైదరాబాద్, మహానాడు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు శనివారం తెలంగాణ భవన్లో ప్రమాదాల్లో మృతిచెందిన 200 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు కూడా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని, ఆయన మదిలో నుంచి పుట్టిన ఆలోచనే ఈ కార్యక్ర మమని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునే ప్రతిఒక్కరికీ ప్రమాద బీమా కల్పిస్తున్నామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.118 కోట్లకు పైగా వెచించినట్లు తెలిపారు. 5522 మందికి రూ.110 కోట్ల మేర లబ్ధి జరిగిందని, అధికారంలో లేనంత మాత్రాన ఇది ఆగిపోదని వివరించారు. బీఆర్ఎస్ కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ అని, ఏ కష్టం వచ్చినా సంప్రదించాలని కోరారు.