నిరుద్యోగులకు ఉపాధికల్పనే లక్ష్యం

– జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన
టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: నిరుద్యోగుల ఉపాధికి దారి చూపే కీలక వేదికగా ఎంప్లాయిమెంట్‌ సెల్‌ ప్రారంభించామని, వలసలను నివారించి అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఉపాధి చూపడమే లక్ష్యంగా పనిచేస్తామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. చదువు మధ్యలో ఆపిన వారు, డిగ్రీ తరువాత ఉపాధి కోసం అన్వేషించే వారికి ఉద్యోగాల కోసం తమవంతు కృషి చేస్తున్నామని ఆమె ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

ఎంప్లాయిమెంట్‌ సెల్‌ పేరిట క్యూ ఆర్‌ కోడ్‌ లింకులో అభ్యర్థుల వివరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే నిరుద్యోగి అనే గుర్తింపు వస్తుందన్నారు. తద్వారా వారి అర్హతకు తగిన ఉద్యోగం పొందే అవకాశం దక్కుతోందన్నారు. చదువుతో సంబంధం లేకుండా 14 ఏళ్ళు దాటిన ఎవరైనా ఈ ఎంప్లాయిమెంట్‌సెల్‌ లో తమ అర్హతల వివరాలను నమోదు చేసుకోవచ్చునని వివరించారు. విద్యార్హత, ఆధార్, కులం, నివాస ధ్రువపత్రాలతో ఉపాధి అవకాశానికి నమోదు చేసుకోవచ్చన్నారు.

దర్శి, కురిచేడు, దొనకొండ, తాళ్లూరు, ముండ్లమూరు ప్రాంతాల్లో చాలా మంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర దూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని, తమ దృష్టికి వచ్చినట్టు గొట్టిపాటి లక్ష్మి అన్నారు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వెళ్ళి తాపీ మేస్త్రీలు, వర్కర్లుగా పనిచేస్తున్నారని, వీరందరికీ స్థానికంగా ఉపాధి దొరకకపోవడమే కారణమని గుర్తించామన్నారు. ఇలాంటి పరిస్థితులను సరిదిద్ది స్థానికంగానే ఇక్కడి యువతకు ఉపాధి చూపేందుకు ప్రణాళికాబద్ధంగా కొన్ని ప్రముఖ కంపెనీలతో చర్చించి, ఈ ఎంప్లాయిమెంట్‌ సెల్‌ రూపొందించామని గొట్టిపాటి లక్ష్మి వివరించారు.

ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సహాయ సహకారాలతో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి అనేక రకాల ఆలోచనలు చేస్తున్నామని ఆమె తెలిపారు. రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలో దిశానిర్దేశం చేసే రాజకీయ అనుభవశాలి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాయకత్వ సవ్యసాచిగా ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌, యువ నాయకత్వానికి స్ఫూర్తిగా నిలిచిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ మార్గదర్శకంలో తాను దర్శి అభివృద్ధి రూపురేఖలు మార్చాలనే తపనతో పనిచేస్తున్నట్టు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.

దర్శి నియోజకవర్గ యువతకు ఉపాధి చూపడంలో మా సంకల్పానికి తోడుగా నిలిచే ప్రతీ ఒక్క కంపెనీని, సంస్థను కలుపుకొని ముందుకు వెళతామని, దర్శి సర్వతోముఖాభివృద్ధికి అహరహం పనిచేయడమే మా లక్ష్యమని ఆమె వివరించారు. తన ఆశయ లక్ష్యానికి సహకరించే ప్రతీ ఒక్క టీడీపీ, జనసేన, బీజేపీ అధినాయకత్వానికి, కార్యకర్తల శ్రేణులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, కురిచేడు మండల పార్టీ అధ్యక్షుడు నెమలయ్య, దొనకొండ మండల పార్టీ అధ్యక్షుడు శివ కోటేశ్వరరావు, టౌన్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు తదితరులు పాల్గొన్నారు.