– కేటీఆర్ విమర్శ
చేవెళ్ళ, మహానాడు: కేసీఆర్ పోయినంక మా షాబాద్ కు, చేవెళ్లకు కల పోయిందని ఓ పెళ్లికి వెళితే రవీందర్ రెడ్డి అనే తమ్ముడు చెప్పాడు…
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైనయ్ అని రవీందర్ రెడ్డి మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి రైతు అనుకుంటున్నాడు… డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం రూ. 2 లక్షలు రుణం ఎత్తేస్తా సోనియా గాంధీ మీద ఒట్టేసి చెప్పాడు రేవంత్ రెడ్డి. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు.
కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశాం. ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు చెప్పారు. దీంతో తప్పించుకునేందుకు చావు తెలివితేటలు స్టార్ట్ చేయటం మొదలు పెట్టాడు. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ. 40 వేల కోట్లు కట్టేస్తా అని 9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడాడు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి…ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15 కు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. ఆగస్ట్ 15 పోయింది. రుణమాఫీ కాలేదు. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు. దైవ ద్రోహం చేసిండు ఈ దుర్మార్గుడు. కేసీఆర్ ను తిట్టి నాలుగు ఓట్లు వేయించుకొని ఆ తర్వాత అవతలపడ్డాడు. ఆ తర్వాత జులైలో మంత్రివర్గంలో చర్చించి ఏదో విధంగా కటింగ్ పెట్టాలని సీఎంకు మంత్రులు సలహా ఇచ్చారు. అందుకే కేబినెట్ లో మీటింగ్ నాటికి దాన్ని రూ. 31 వేల కోట్లకు దాన్ని తగ్గించారు. ఇక బడ్జెట్ లో దాన్ని రూ. 26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. దీని మీద గట్టిగా అడిగితే చెప్ప చేతకాలేదు.
సబితక్క రేవంత్ రెడ్డికి పాలన చేతనైతలేదని చెబితే కోపం వచ్చి మహిళా శాసనసభ్యులను అవమానించాడు. ఒక ఆడబిడ్డ నాలుగున్నర గంటలు నిలబడి మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏడిపించి దుర్మార్గంగా వ్యవహారించారు. సబితా ఇంద్రారెడ్డి లాంటి నేతను నిండు శాసన సభలో అవమానించాడు. ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చే సత్తా లేని కారణంగానే ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని ఖమ్మం జిల్లాలో సీఎం చెప్పటంతో మొత్తం రైతులు తిరగబడ్డారు. దీంతో రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. నీ సొంత ఊళ్లో రైతులకు వంద శాతం రుణమాఫీ అయినట్లు రైతులు చెబితే రాజీనామా చేస్తా అని నేను సవాల్ చేసినా. నా సవాల్ కు సమాాధానం లేదు. స్పందన లేదు. 49 వేల కోట్ల నుంచి 17 వేల కోట్లకు తీసుకొచ్చారు. అదన్నా నిజం అనుకున్నాం. కానీ డిప్యూటీ సీఎం రైతులకు రూ. 7500 కోట్లు మాత్రమే వేసినం అని ఆయనే చెప్పారు.
ఎక్కడ 49 వేల కోట్లు…ఎక్కడి రూ. 7500 కోట్లు. అంటే రూ. 7500 కోట్లతోనే దీన్ని ఇక్కడికే ఖతం చేద్దామని చూస్తున్నారు. రైతన్నలు ఆలోచించాలి. మోసం చేసినోన్ని గల్లా పట్టి నిలదీయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం రుణం మాఫీ అయితదని అనుకున్నా అని నర్సాపూర్ లో ఒక రైతు చెప్పాడు. 9 నెలల లేటుకు గాను వడ్డీ అడుగుతున్నారంట. రైతుల మిత్తి తో సహా ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనన్నదే మన డిమాండ్. రుణమాఫీ లో కటింగ్ పెడితే…రైతుభరోసాలో కూడా కటింగ్ లు పెడుతాడు. మీరు ఇప్పుడు వదిలిస్తే….తర్వాత కూడా ఇదే విధంగా కోతలు పెట్టుకుంటు పోతాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 72 మంది లక్షల రైతులకు రైతు బంధు వేశాం. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నయ్. రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మనం అడగాల్సింది అధికారులను కాదు. కాంగ్రెస్ నాయకులను అడగాలె. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే.