మీడియా అంటేనే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి

Yanamala-Ramakrishnudu-2

– పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డి
– యనమల రామకృష్ణుడు

మీడియాపై వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు చోటు లేదు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇలా వాటిని ఉసుగొల్పుతున్న జగన్ రెడ్డికి ప్రజాకోర్టులో ఓటమి తీర్పు తప్పదు. ప్రశ్నించే గళం వింటే జగన్ రెడ్డికి వణికిపోతున్నారు. వాస్తవాలు ప్రజలకు చేరవేసే మీడియా అంటేనే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి. అందుకే ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, మీడియాపై యదేచ్చగా దాడులు చేయిస్తున్నారు.

ఓటమితో పాటు పరాభవం ఖాయమని తెలిసి ఉద్దేశ్యపూర్వకంగానే వైసీపీ రౌడీ మూక తెగబడుతున్నారు. చొక్కాలు మడతపెట్టండి అనడం, ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి కార్యకర్తలతో కొట్టించడం జగన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు నిదర్శనం. ఆయన ప్రతి సభల్లోను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ -5ల పేరెత్తని సభ అంటూ ఉండదు.

జగన్ రెడ్డి నిరంకుశత్వ పాలనతో పాటు లాండ్, శాండ్, వైన్, మైన్, అత్యాచారాలు, హత్యలను వెలుగులోకి తెస్తున్న ఫోర్త్ ఎస్టేట్ పై దాడి చేయించడం అంటే ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. నియంతలకు, నిరంకుశత్వ పాలకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. ఇలాంటి వారు కాలగర్బంలో కలిసిపోక తప్పదు.

పత్రికలపై దాడి చేయించమని జగన్ రెడ్డి ఉసిగొల్పుతున్నారంటే రాబోయే రోజుల్లో సాక్షి పత్రిక, మీడియా విలేకర్లకు భధ్రత లేకుండా చేస్తున్నట్లే. జగన్ రెడ్డి నవరత్నాల పేరుతో చేస్తున్న మోసపు సంక్షేమాన్ని మీడియా సంస్థలు ఎండగట్టాన్ని తట్టుకోలేకపోతున్నారు. అంతేకాకుండా జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలు, భూకబ్జాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నారని మీడియాపై దాడులు చేయిస్తున్నారు. నిన్న కర్నూలులో కాటసాని సైకో గ్యాంగ్ ఈనాడు కార్యాలయంపై పోలీసుల సమక్షంలో దాడులు చేశారు. మొన్న రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి విలేఖరిపై తీవ్రంగా దాడులు చేశారు.