రాయపూడి లో భవన సముదాయాలను పరిశీలించిన స్పీకర్  

అదనంగా రూ.300 కోట్లు కేటాయింపు 
త్వరితగతిన పూర్తి చేయాలని సీఆర్డీఏకు స్పీకర్ ఆదేశం  

అమరావతి, మహానాడు :  అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి  పరిశీలించారు.

ఈ సందర్బంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…

రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12 అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టగా 2019 నాటికి 77 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిలిపి వేసి నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు.

గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఆయా పనులన్నింటినీ తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు అంచనా వ్యయం భారీగా పెరగడంతో పాటు గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను పూర్తి చేసేందుకే అదనంగా 300 కోట్ల రూ.లు ఖర్చు కానుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు.

గత ఐదేళ్లుగా పనులు నిలిపి వేయడంతో చాలా వరకు నిర్మాణ సామాగ్రి తుప్పు పట్టడం,కొంత మెటీరియల్ అపహరణకు గురికావడం వంటి సంఘటనలు జరిగాయని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు మీడియాకు వివరించారు.అమరావతి రాజధానిలో ఎంఎల్ఏ, ఎంఎల్సిలకు,ఇతర ఉన్నతాధికారులు,సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలు హైదరాబాదులో కూడా లేవని అన్నారు.

ఈ భవన సముదాయానికి సంబంధించిన ఫినిషింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి 9 మాసాల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ అధికారులను కోరడం జరిగిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఆర్డిఏ కమీషనర్ కాటమనేని భాస్కర్,అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పిపికె రామాచార్యులు,ఎంఎల్ఏలు విష్ణు కుమార్ రాజు,టి.శ్రావణ్ కుమార్, సిఆర్డిఏ, అసెంబ్లీ అధికారులు తదితరులు పాల్గొన్నారు