ప్ర‌తి జిల్లాలో 15 శాతం వృద్ధి సాధ‌నే ల‌క్ష్యం

– ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్‌

అమ‌రావ‌తి మహానాడు: ప్రతి జిల్లాలో 15 శాతం వద్ధి సాధనే లక్ష్యంగా సర్కారు పెట్టుకుందని, అక్టోబరు రెండోతేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం విజ‌న్ 2027 విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ డాక్యుమెంటును విడుద‌ల చేస్తుంద‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్వి పీయూష్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ గురించి క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న వివ‌రించారు. దీనికి ఇంకా మంచి పేరు ఎవ‌రైనా సూచించ‌వ‌చ్చ‌న్నారు. జీరో పావ‌ర్టీ, సోషియ‌ల్ అండ్ ఫిజిక‌ల్ ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్, డెమోగ్ర‌ఫిక్ మేనేజ్‌మెంట్‌, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే నాలుగు అంశాలు ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఈ డాక్యుమెంటు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. ఈ నెల ఆరోతేదీ నుంచి ఎనిమిది వరకు ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శుల‌తో నీతి ఆయోగ్ అధికారులు భేటీ అవుతార‌ని, ఈ నెల 15వ తేదీలోపు ఈ విజ‌న్ డాక్యుమెంటుకు సంబంధించి ఆయా శాఖ‌ల అధికారుల నుంచి సూచ‌న‌లు స‌ల‌హాలు తీసుకుంటామ‌ని చెప్పారు. సెప్టెంబ‌రు ఒకటోతేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకోవ‌డానికి ఈ డాక్యుమెంటును ప‌బ్లిక్ డొమైన్లో పెడ‌తామ‌ని చెప్పారు. మొత్తం 12 ర‌కాలు ప్రాధాన్య‌తా అంశాలతో ఈ డాక్యుమెంటును రూపొందించనున్నట్టు పీయూష్‌ పేర్కొన్నారు. అక్టోబ‌రు రెండో తేదీ ఈ విజ‌న్ 2027 డాక్యుమెంటును ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విడుద‌ల చేస్తార‌ని వెల్ల‌డించారు.