ఆ బ్రాండ్లు బాబు హయాంలోనివే

– మేం ఒక్క డిస్టలరీకి అనుమతివ్వలేదు
– మేం మద్యం షాలుల్లో డిజిల్ విధానం ప్రవేశపెట్టాం
– ప్రభుత్వ వైట్‌ పేపర్ల పై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌

తాడేపల్లి: 2014–19 మధ్య అప్పుడు 4,380 మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తే.. అదే సంఖ్యలో వాటికి అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు కొనసాగాయి. మరోవైపు విచ్చలవిడిగా ఊరూరా.. 43 వేలకు పైగా బెల్ట్‌షాపులు. వాటిలో మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే 25 శాతం అధిక ధరలకు మద్యం అమ్మారు. ఇంకా ఏటా బార్లు పెంచారు. ఆ మేరకు లైసెన్సులు ఇచ్చారని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం తన పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించి.. విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై జగన్ స్పందించారు. ఆ మేరకు తన వద్ద ఉన్న ఆధారాలు మీడియాకు వెల్లడించారు. జగన్ ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు: వైయస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా, ఏ డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. మద్యం బ్రాండ్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. ప్రెసిడెంట్‌ మెడల్, హైదరాబాద్‌ బ్లూ డీలక్స్‌ ఈ రెండు బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు. 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు.

గవర్నర్‌ రిజర్వ్, లెఫైర్‌ నెపోలియన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ.. పేర్లతో దాదాపు 15 బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా నాడు, ఒకేరోజు చంద్రబాబు ప్రభుత్వమే.. 2018, అక్టోబరు 26న అనుమతి ఇచ్చింది.

హైవోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ ఎంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా బ్రాండ్ల.. బీర్లు సైతం చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే. వాటన్నింటికి 2017, జూన్‌ 7న అనుమతి ఇచ్చారు. రాయల్‌ ప్యాలెస్, న్యూకింగ్, సైన్‌ అవుట్‌.. బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా చంద్రబాబే.. 2018, నవంబరు 9న అనుమతిచ్చారు.

బిరా 91 పేరుతో మూడు రకాల బీర్‌ బ్రాండ్లకు కూడా అపధర్మంగా ఉన్న (ఎన్నికలు జరిగి, ఫలితాలు వెలువడక ముందు) చంద్రబాబు ప్రభుత్వం 2019, మే 14న అనుమతి ఇచ్చారు. ఆ మర్నాడే (2019, మే 15న) టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌.. బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా క్లియరెన్స్‌ ఇచ్చారు.

రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలు అంతకు ముందున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అందుకే టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డిస్టిలరీలు తయారు చేసిన మద్యం విక్రయాలే.. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగాయి.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా, వాటిని 2,934కు తగ్గించాము. ప్రతి వైన్‌ షాప్‌కు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశాం. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43 వేల బెల్ట్‌షాప్‌లు రద్దు చేశాం. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి, 2019, అక్టోబరు 1 నుంచి, వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాం.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు షాక్‌ కొట్టేలా ధరలు పెంచాం. మద్యం షాపుల్లో డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది మా ప్రభుత్వమే. అయినా మాపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు.

నాటి మద్యంలో విషపు అవశేషాలు ఉన్నట్లు చెన్నైలోని ఎస్‌జీఎస్‌ లేబొరేటరీ పేరిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదికేదీ తాము ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజ సిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని ఆ లేబొరేటరీ ప్రకటించింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది.

అయినప్పటికీ రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ల్యాబ్‌లో పరీక్షించడం జరిగింది. ఆ శాంపిల్స్‌ (నమూనాలు) అన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ఐఐసీటీ కూడా నివేదిక ఇచ్చింది.

ఆ వివరాలు ఇవీ..:

2014–19. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు..
ఏడాది ఐఎంఎల్‌ (మద్యం) బీర్లు (కేసుల్లో)
2014–15 2.88 కోట్లు 1.74కోట్లు
2015–16 3.06 కోట్లు 1.75 కోట్లు
2016–17 3.32 కోట్లు 1.78 కోట్లు
2017–18 3.60 కోట్లు 2.27 కోట్లు
2018–19 3.84 కోట్లు 2.77 కోట్లు

2019–24. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు..

ఏడాది ఐఎంఎల్‌ (మద్యం) బీర్లు (కేసుల్లో)
2019–20 3.08 కోట్లు 2.12 కోట్లు
2020–21 1.87 కోట్లు 57 లక్షలు
2021–22 2.63 కోట్లు 82 లక్షలు
2022–23 3.35 కోట్లు 1.16 కోట్లు
2023–24 3.32 కోట్లు 1.12 కోట్లు