ప్రభుత్వానికి బాండ్ రూపంలో తన ఆస్తులు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేత
పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్
నల్గొండ, మహానాడు : దేశంలో నల్గొండ జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మరో సంచలన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటివరకు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు తీసుకోని సంచలన నిర్ణయం నల్గొండ నడి బొడ్డున నవ నాయకుడు ప్రజా గొంతుక, తీన్మార్ మల్లన్న తీసుకున్నాడు. నాయకుడంటే ప్రజల కోసం బతికేవాడు, ప్రజల మీద బతికే వాడు కాదని నిరూపించారు. గతంలో చెప్పినట్టే తాను రాజకీయాల్లో అడుగు పెట్టేనాడు తన పేరు మీద, తన కుటుంబసభ్యుల పేరుతో ఉన్న అస్తి మొత్తం ప్రభుత్వానికి రాసి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు.
ఆ మాట నిలబెట్టుకుంటూ శుక్రవారం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్లన్న నామినేషన్ వేసే సందర్భంలో తన, తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చారు. నిజమైన ప్రజా నాయకుడుగా చరిత్రలో తనకం టూ ఓ పేజీని రాసుకున్నాడు. ఇంత కాలం అనేక విమర్శలు వచ్చినా భరిస్తూ వచ్చిన మల్లన్న తాను మాటల నాయకుడిని కాదని చేతల నాయకుడిని అని చాటి చెప్పారు. దీంతో వేదిక మీదున్న పెద్దలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మల్లన్న అభిమానులు మల్లన్న నిర్ణయంతో హర్షధ్వానాలు చేశారు. కాగా ఆస్తుల బాండ్ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు.