– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, మహానాడు: సామాజిక సేవాభావంతో యూటీఎఫ్ ఘనకీర్తి కైవసం చేసుకుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ముఖ్య అతిథి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ హాజరై, ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు ఆ సమాజానికి కష్టం వచ్చినప్పుడు బాధ్యతగా ముందుండి ఆదుకుంటారనే భావన ప్రజల్లో కలిగించేందుకు యూటీఎఫ్ నిర్వహించే కార్యక్రమాలు దోహద పడుతున్నాయని తెలిపారు. వరద విపత్తు నేపథ్యంలో బాధిత కుటుంబాల వారిని ఆదుకునేందుకు యూటీఎఫ్ విస్తృత సేవా కార్యక్రమాలు చేయడం ప్రశంసనీయమన్నారు.
విద్యావ్యవస్థలో వినూత్న సంస్కరణలు తెచ్చేందుకు విద్యా సదస్సుల ద్వారా చర్చించి సమగ్ర నివేదికలు ప్రభుత్వానికి సమర్పించి విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు యుటిఎఫ్ నాయకత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఆయన తనయుడు మండలి వెంకట్రామ్ లను ఘనంగా సత్కరించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే.ఏ.ఉమామహేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు బి.కనకారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జే.లెనిన్ బాబు, గౌరవ అధ్యక్షుడు నీలం ప్రభాకరరావు, నాయకులు షౌకత్ హుస్సేన్, మరీదు వరప్రసాద్, యూటీఎఫ్ జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.