విశాఖ ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ
మంగళగిరి, మహానాడు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నా యుడు సోమవారం లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయ లేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. మీడియాపై కేసులు ఎత్తేసి కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, హింసను అరికట్టడంలో విఫలమైన కొందరు పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుందని తెలిపారు. ఈ క్రమంలో తమ తప్పులను కప్పిపు చ్చుకునేందుకు విశాఖలో పోలీసులు మీడియాపైనే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని లేఖలో వివరించారు.
బాధితులు కూడా చెబుతున్నారు..
వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంతోనే తమపై దాడి జరిగిందని బాధితులు కూడా చెబుతున్నారు. వారు చెప్పిన విషయాన్నే మీడియా కూడా ప్రచురించింది. ఈ ఘటనపై విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు మాత్రం వైసీపీ నేతలతో కలిసి దాడి ఘటనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
మీడియాపై కేసులా?
బాధితుల గళం వినిపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి సిబ్బందితో పాటు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుపైనా కేసులు నమోదు చేశారు. దాడి ఘటనను మీడియా ద్వారా రిపోర్ట్ చేయడమే నేరమన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ని కల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రసారం చేయడం తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విశాఖలో ఎన్నికల అనంతరం హింసను అదుపు చేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అలాగే అక్రమ కేసులతో మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేసిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి కూడా పంపారు.