– రాష్ట్రవ్యాప్తంగా రూ. 4,500 కోట్లతో 30 వేల పనులు
– 8 లక్షల కుటుంబాలకు ‘ఉపాధి’
– 3 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాలు
– 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు
– కంకిపాడులో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన
మచిలీపట్నం, మహానాడు: పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ వందరోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అలాగే కంకిపాడు గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 95.15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 11 అంతర్గత సిమెంటు రహదారులు, రెండు మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునాదిపాడు గ్రామపంచాయతీలో 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 2 అంతర్గత రహదారుల నిర్మాణానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ గ్రామంలో 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్, సంచాలకులు కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్.గంగాధర్ రావు, పెనమలూరు, గుడివాడ, పామర్రు, పెడన శాసన సభ్యుడు బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్ పలువురు జిల్లా అధికారులు, కంకిపాడు ఎంపీపీ నెరసు రాజలక్ష్మి, సర్పంచు బాకి రమణ, పునాదిపాడు సర్పంచ్ ఎం.విజయకుమారి, బండి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.