32 డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయింది

– మంత్రి నారాయణ

విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు బోండా ఉమా, కొలికపూడితో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గురువారం పర్యటించారు. పాయకాపురం, వుడా కాలనీ, జర్నలిస్టు కాలనీ, కండ్రిక, ఆంబాపురాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని బయటికి పంపింగ్ చేయడంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాయకాపురం నుంచి ముస్తాబాద వరకూ బుడమేరు ప్రవహించే మార్గం పరిశీలించారు. ఇళ్ళ మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరు లోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని నారాయణ సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే.. విజయవాడలో మొత్తం 32 డివిజన్లలో నీరు దాదాపు తగ్గిపోయింది. ఒకట్రెండు డివిజన్లలో వరద నీరు కొద్దిగా నిల్వ ఉంది. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు అవసరమైన చోట రోడ్లకు గండ్లు కొడుతున్నాం. రేపు సాయంత్రానికి మొత్తం నీరు బయటికి పంపింగ్ చేస్తాం. అన్ని డివిజన్లలో శానిటేషన్ కూడా పూర్తి కావస్తోంది. వరద ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుంది.