కొందరి అవినీతి వల్లే నీటి సమస్య

పెమ్మసాని ఆధ్వర్యంలో ఉప్పలపాడు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ‘కేవలం అవినీతి అధికారులు, నాయకులు చేసిన కక్కుర్తి వలన గుంటూరు కార్పోరేషన్ పరిధిలో నీటి సమస్య తలెత్తింది. ఎన్నికలు పూర్తి కాగానే ఒక్కొక్కరి భాగోతం బయటపెడతాను, నీటి సమస్య పరిష్కరిస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. పెదకాకాని మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని తక్కెళ్ళపాడు, వెంకట కృష్ణాపురం, ఉప్పలపాడు, నంబూరు తదితర గ్రామాలలో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి మంగళవారం పర్యటించారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఉప్పలపాడులో సహకరిస్తున్న కార్యకర్తలను, ప్రజలను చూస్తుంటే అసలు ఈ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదనిపిస్తుంది అని తెలిపారు. పాదయాత్రకు వచ్చిన జగన్ ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లారే తప్ప, ఐదేళ్లుగా జనం మొహం చూడడం మానేశారని ఎద్దేవా చేశారు. ఆయనేమో ఏసీ బస్సులో తిరుగుతూ, ప్రజల్ని అవస్థల పాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన వారికి డాక్టర్ పెమ్మసాని, దూలిపాళ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

అనంతరం ధూళిపాళ్ల మాట్లాడుతూ గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు టిడిపి హయాంలో వేసిందే తప్ప ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఒక్క రోడ్డు కూడా నిర్మింపబడలేదని తెలిపారు. నీళ్లు ఇవ్వలేక సర్పంచ్, అధికారులు తిప్పలు పడుతున్నారని, నాలుగేళ్ల పది నెలలుగా చేయని నీటి సరఫరా కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. గుంటూరు ఛానల్ కు నిధులు సేకరించిందని జగన్ ప్రభుత్వం వచ్చాక తనకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఇప్పుడు రద్దుకు సిద్ధంగా ఉన్న పరిస్థితులు చూసి కూడా జగన్ స్పందించడం లేదన్నారు.