హరీష్ రావు
హైదారాబాద్, మహానాడు: గూడెం మహిపాల్ రెడ్డి, వారి తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని,ప్రతిపక్షాలను వేదించడం సరికాదన్నారు.
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని పరామర్శించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయి అన్నారు.
మహిపాల్ రెడ్డి నివాసంలో కనీసం డబ్బు, బంగారం కానీ అక్రమంగా దొరకలేదు. ప్రతిదీ ఐటీ రిటర్న్స్తో సహా పక్కా వివరాలతో స్పష్టంగా ఉన్నాయి. ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్లు అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష శాసనసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం లొంగదీసుకోడానికి ఈ దాడులు చేయిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందనీ, కేంద్ర ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది అని ఎద్దేవా చేశారు.
నీట్ ప్రశ్నపత్రం లీకైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అధికార పక్షానికి ఒక నీతి, ప్రతిపక్షాలకు ఒకనీతినా? అని ప్రశ్నించారు. 24 లక్షమంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.
బీహార్, గుజరాత్లలో పరీక్షకు రెండురోజుల ముందు పేపర్ లీకై పత్రాలను అంగట్లో సరుకులా లక్షలకు అమ్ముకుంటుంటే ఈడీ, ఐటీ ఎందుకు దాడులు చేయడం లేదు? అక్కడ మనీల్యాండరింగ్ కనిపిచం లేదా అన్నారు. అక్కడ అధికారులపై, పరీక్షలు జరిపిన ఎన్టీపై ఎందుకు దాడులు జరపడం లేదు అని ప్రశ్నించారు.
ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని, పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి అందుకు విరుద్ధంగా పనిచేస్తోందన్నారు.
మా కదలికలను ఇంటెలిజెల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా నిఘా పెడుతూ టార్గెట్ చేస్తున్నారనీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరుగుతూ, మాట వినకపోతే కేసులు, దాడులతో బెదిరిస్తున్నారనీ,
ప్రజలు అధికారం ఇచ్చింది హామీలను అమలు చేయడానికి, ప్రతిపక్షాలను వేధించడానికి కాదు అని సూచించారు.
మహిపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించారు. బీరువాల తాళాలు, పేపర్లు ఇచ్చారు. వారు ఎలాంటి తప్పు చేయలేదు. ఈడి కి ఏలాంటి ఆస్తులు దొరకలేదు. అయినా ఇంట్లో ఉన్న పసిపిల్లలు కూడా ఏడ్చేలా ఈడీ అధికారులు వేధించారన్నారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలస్తుంది అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.