మేం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదు

– గల్లా జయదేవ్‌ కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
– లోకేష్‌

గుంటూరు: రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో లోకేశ్‌ మాట్లాడారు.. అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్‌ అని కొనియాడారు. ఆయన కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు..

”మేం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదు. రైతుల కోసం పోరాటం చేసిన ఎంపీని, ఆయన సంస్థలను అధికార పార్టీ నేతలు ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. గుంటూరు టికెట్‌ ఎవరైనా వదులుకుంటారా? కానీ, జయదేవ్‌ వదులుకున్నారు. పార్టీ మారే అలవాటు తమ వంశంలో లేదని చెప్పారు. రాజకీయాలకు తాత్కాలికంగా దూరమవుతున్నా కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నా”అని తెలిపారు. రాజకీయాల్లో అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్‌కు జయదేవ్‌ ధన్యవాదాలు తెలిపారు.