ఔరా..ఏమి ఎగ్జిట్‌ పోల్స్‌!

-మోదీ విలాసం..మోదీ విలాపం
-జగనన్న మోదం…జగనన్న ఖేదం
-ఎందుకు డౌటనుమానం?
-అధినేతలందరికీ తెలుసు
-అందుకే ఆందోళన

అమరావతి: ఎగ్జిట్‌ పోల్‌…ఎగ్జిట్‌ పోల్‌…ఎగ్జిట్‌ పోల్‌…ఉదయం లేచించి మొదలు ఒకటే గోల. మూడురోజుల్లో ఎవరి తలరాత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ ఎగ్జిట్‌ పోల్‌ పేరుతో మీడియా సంస్థలు పూనకాలతో చెలరేగిపోయేందుకు బస్కీలు మీద బస్కీలు తీస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్‌ పోల్‌ పేరుతో యూటూబర్స్‌ లక్షలకు లక్షల వ్యూస్‌ గొల్లగొట్టేశారు. ఏపీలో ఫేక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌నూ మనోళ్లు ట్రోల్‌ చేశారు. ఇక టీఆర్సీ కోసం శాటిలైట్‌ చానల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై కర్చీఫ్‌లు వేశాయి. మోదీ విలాసం, మోదీ విలాపం కోసం జాతీయ మీడియాల కథలు వినేందుకు జాతీయ పార్టీలు, జగన్‌ మోదం.. జగన్‌ ఖేదం వినేందుకు ఏపీలో కూటమి దిగ్గజ్జాలు బొటనవేలిపై నిలబడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని పొలిటికల్‌ అనలిస్టులూ.. మాటల తూటాలు పేల్చుతున్నారు. కానీ ఒకటి నిజం జనం మదిలో డౌటనుమా నం పీడిస్తోంది. అటు ఢిల్లీలో.. ఇటు ఏపీ గల్లీలో నాయకులకూ ఎగ్జిట్‌ పోల్స్‌ సమాచారం తెలియదా? ఎందుకు తెలియదు.. ఇప్పటికే సోషల్‌ మీడియాలో అన్ని రాజకీయ పార్టీల పేటీఎం బ్యాచ్‌లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఊదర గొట్టేశాయి. మళ్లీ ఇప్పుడు శనివారం సాయంత్రం 6.30 గంటల తరువాత డీబేట్‌లతో అరుపులు, కేకల సీన్‌ లు అవసరమా?

క్లారిటీ వచ్చేసింది…
ఏపీ సంగతి చూద్దాం. సాక్షి, ఎన్టీవీ, టీవీ 9 ఈ మూడు చానల్స్‌ ప్రస్తుతం ప్రజల పక్షం… అదే జగనన్న పక్షం అని జనం ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇక పచ్చ మీడియా బిరుదాంకిత ఈనాడు, ఏబీఎన్‌, టీవీ 5 నూటికి నూరు శాతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రచార రథాలని ఏపీ జనానికి తెలుసు. మరి ఈ ఆరు చానల్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను తమ యాజమాన్య పార్టీలకు సమర్పించలేదా? అంటే..అవును మే 14నే ఎగ్జిట్‌ పోల్‌ రిజల్ట్‌ ఆయా రాజకీయ పార్టీల అధినేతలకు..పంచాంగ శ్రవణం చేశాయి. ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుందో? ఓ క్లారిటీ వచ్చేసింది. అందుకే అప్పుడే జగడాలు తెరమీదకు వచ్చాయి. ఓట్లను మురగబెట్టే వ్యూహం గొడవకు దారి తీసింది. ఓట్ల పెట్టెలు తెరవక ముందే తూచ్‌ తొండి తొండి అంటూ గగ్గోలు పార్టీ చెలరేగిపోతోంది. ఇక హైకోర్టు తీర్పు వస్తుంది. ఇది సరే.. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఫేక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ను మనోళ్లు ట్రోల్‌ చేశారు. ఐతే… వైనాట్‌ 175లో 1 తీస్తే.. మిగిలేది 75. అంటే ఏ పార్టీకి 175 రావు…151 రావు…153 కుదరదు. ఏ పార్టీ గెలిచినా 110.. 65… లేదా 120… 55 ఇదీ సంఖ్య. ఎందుకంటే.. 55 శాతం అక్కా చెల్లెమ్మలు, 60 శాతం అవ్వాతాతలు తమ బిడ్డ జగనయ్యకు ఓటేస్తే.. 66 శాతం మగ మందుబాబులు సైకిల్‌ ఎక్కి గ్లాజు గ్లాసులో గుటకేశారు. ఇక పనిపాట లేక హైదరాబాద్‌, బెంగ ళూరు, చెన్నైల్లో అద్దె కొంపల్లో అల్లాడిన నిరుద్యోగుల్లో 40 శాతం మంది ఊళ్లో అమ్మ కొంగులో నవరత్నాలకు ఓటు వేస్తే.. మిగిలినోళ్లందరూ నిరుద్యోగభృతికి ఒక్క చాన్స్‌ ఇచ్చారు. ఇక మిగిలింది ఉద్యోగులే. ఈ ఐదేళ్లు.. తాము అనుభవిం చిన వ్యథకు శిక్ష వేస్తున్నారు. 4.44 లక్షల ఉద్యోగుల ఓట్లల్లో మెజారిటీ ఓట్లే కీలకం కానున్నాయి. అందుకే అధికార పక్షం ఆందోళనతో అల్లాడుతోంది.