-బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం నిర్లక్ష్యం
-మిల్లుల అలాట్ లేక దళారులకు విక్రయం
-కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్
కరీంనగర్ జిల్లా చొప్పదండి, మహానాడు: వరికోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలోని మాల్యాల మండల కేంద్రంలో వరి ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు కొనుగోలు చేస్తే రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుం దనే కారణంతో కొనుగోలు చేయటం లేదన్నారు. గ్రామాల్లో రైతులు ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసినా ఎప్పుడు కొంటారో తెలియ క దళారులకు రూ.1800 ధరకు అమ్ముకుని నష్టపోతున్నారని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మిల్లులు అలాట్ చేయలేదని చేయలేదని, విధిలేని పరిస్థితుల్లో రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారని విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీటీసీ రామ్మోహన్రావు, మాజీ ఎంపీపీ విమల సుదర్శన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రామడుగు పీఏసీఎస్ చైర్మన్ వీర్ల వేంకటేశ్వరరావు, సాగర్ రావు, సుబాన్ తదితరులు పాల్గొన్నారు.