Mahanaadu-Logo-PNG-Large

దేశం ఎటు పోతుంది?

-ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి 
-సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి 
-ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని చక్కదిద్దాలి
-దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం
-న్యూఢిల్లీలో వైకాపా నిరసనకు మద్దతు తెలిపిన నేతలు 

న్యూఢిల్లీ, మహానాడు :  ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, వైకాపాపై దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడులకు సంబంధించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో నిరసన కార్యక్రమం, ఫోటో గ్యాలరీని సందర్శించిన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌. ప్రియాంక చతుర్వేది (శివసేన), నదిముల్‌హక్‌ (తృణమూల్‌ కాంగ్రెస్‌), తిరుమా వలవన్‌. వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు), రాజేంద్రపాల్‌ గౌతమ్‌. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)  నేతలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంఘీభావం ప్రకటించారు.

ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనల వీడియోలు చూసిన తరవాత, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. నాకు ఒక్కటే అనిపించింది. స్వతంత్ర భారతావనిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీసం వాటిని ఊహించలేము. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏమైంది? గవర్నర్‌ ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. విపక్ష పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారు. వారిపై దాడి చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి, టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నానన్నారు.

సుప్రీంకోర్టు సుమోటోగా  తీసుకోవాలి
శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. ఎన్నికల తరవాత ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో.. అన్న విషయాలు చూపారు. మాకు చాలా ఆవేదన కలిగింది.రాష్ట్రాల్లో ఏం జరిగినా, ఢిల్లీకి పట్టదు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, ఎప్పుడూ, ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఏ మాత్రం సరి కాదు. ఇలాంటి వాటిని మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాము. జగన్‌కి మేమంతా మీకు ఒకే భరోసా ఇస్తున్నాము. ఎక్కడైతే వ్యవస్థలపై దాడులు జరుగుతాయో, పార్టీలపై దౌర్జన్యాలు కొనసాగుతాయో.. ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందో.. ఇండియా కూటమి అక్కడ నిలబడి పోరాడుతుంది. భుజం భుజం కలిపి పని చేస్తుంది. ఎందుకంటే, ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ పోరాటమే కాదు.. మీ పార్టీ కార్యకర్తలకు సంబంధించింది మాత్రమే కాదు.. ఎక్కడ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా.. ఇది ఏ ఒక్కరికి మంచిది కాదు. అందుకే మేము అండగా నిలుస్తాము. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్ర గవర్నర్‌ స్పందించాలి. సుప్రీం కోర్టు కూడా సుమోటోగా కేసు స్వీకరించాలి.

ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని చక్కదిద్దాలి
తృణమూల్‌ కాంగ్రెస్‌ నదిముల్‌హక్‌ నాయకులు మాట్లాడుతూ.. నేను బెంగాల్‌ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి, షాక్‌ తిన్నాను. రాష్ట్రంలో ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే, బాధ అనిపిస్తోంది. ఇళ్లపై దాడులు చేశారు. ఆ ఘటనలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్రం సుమోటోగా చర్య తీసుకోవాలి. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చక్కదిద్దాలి. మేము జగన్‌కి, రాష్ట్ర ప్రజలకు అండగా, తోడుగా నిలబడతాము.

దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం
వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు) తిరుమా వలవన్‌ మాట్లాడుతూ… న్యాయం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్‌ అన్నీ చూశాము. నిజంగా షాక్‌కు గురయ్యాము. ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా, అధికార టీడీపీ అనేక దౌర్జన్యాలు చేసింది. వారి ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. పక్కాగా ప్లాన్‌ చేసి మరీ ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన టాప్‌ లీడర్ల ఆదేశాల మేరకే, ఆ పార్టీ కార్యకర్తలు ఈ దాడులు, దౌర్జన్యాలు చేశారు.

ముఖ్యంగా ప్రస్తుత సీఎం కొడుకు, తన పార్టీ కేడర్‌ను ఈ దాడులకు ఉసి గొల్పుతున్నాడు. మా పార్టీ తరపున ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో జరుగుతున్న  అరాచకాలను కేంద్రం కూడా పరోక్షంగా సమర్థిస్తోంది. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలి. మా పార్టీ తరపున వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జగన్‌కి అండగా నిలుస్తాం. ఏపీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాలి. సంబంధిత నాయకులపై కేసులు నమోదు చేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేం డిమాండ్‌ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేలా చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు. అందుకే దీన్ని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కూడా ఖండించాలి. మేమ తప్పనిసరిగా మీకు అండగా నిలుస్తాం. న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటంలో మీకు మద్దతునిస్తామని హామీ ఇచ్చారు.

దేశం ఎటు పోతుంది?
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత రాజేంద్రపాల్‌ గౌతమ్‌ మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరం. దేశం ఎటు పోతుంది? దేశంలో ఏం జరుగుతోంది? నాడు స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ వ్యవస్థను రూపొందించిన వారు, దీన్ని ఆనాడు ఊహించారా? ఎన్నికల్లో గెలిచిన పార్టీ, ఓడిన పార్టీ వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం.. ఏమిటిదంతా? వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది? దేశ ద్రోహుల కంటే వీరు తక్కువ కాదు. కానీ కేంద్రం ఏం చేస్తోంది. ఎన్డీఏ కూటమి కూడా ఎందుకు స్పందించడం లేదు. ఏపీలో జరుగుతున్న ఘటనలపై కేవలం దాడులు, దౌర్జన్యాల కోణంలోనే కాకుండా, దేశద్రోహ కేసులు నమోదు చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి ఏ మాత్రం ఆమోదం కాదు. ఇలా దాడులు చేస్తున్న వారిని వెంటనే జైలుకు పంపాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. వారు దేశానికే ప్రమాదకారిగా మారారు కాబట్టి.. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.