– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ
విజయవాడ, మహానాడు: క్యాబినెట్ మీటింగ్ లో సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారనుకున్నాం.. మహిళలకు శుభవార్త చెప్తారని భావించాం… ఉచిత సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రెండూ బడ్జెట్ స్కీంలు.. బాబు సూపర్ సిక్స్ లు గాలికి కొట్టుకుపోయాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయి. కొత్త పరిశ్రమలు వస్తే మంచిదే.. పెట్టుబడులు రావాలి. ఉద్యోగాలు రావాలి. 30 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తామన్నారు.
– 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. జాబ్ ఫస్ట్ అనే నినాదం అని బాబు చెప్పారు. ఇక్కడ బిలియన్ డాలర్ల ప్రశ్న. ఇవన్నీ అమలు చేసే చిత్తశుద్ది బాబు కి ఉందా?. 2014 లో పెద్ద పెద్ద పథకాలు అన్నారు. అమరావతిని సింగపూర్ అన్నారు. త్రీడి గ్రాఫిక్స్ చూపించారు. అప్పుడు చెప్పిన వాటికి, ఇప్పుడు చెప్పిన వాటికి తేడా లేదు. పాత సినిమా కి కొత్త టైటిల్ పెట్టారు. బాబు చెప్తుంటే ఈ కథ ఎక్కడో విన్నట్లుంది అనిపించింది. పాత గిఫ్ట్ కొత్త బాక్స్ లో ఇస్తున్నారు. ఇవి అమలు అవుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. బాబుని ఒక విషయంలో స్వాగతిస్తున్నాం. జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదే. రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయిలో ఉంది. ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు. గత 10 ఏళ్లుగా పరిశ్రమలు లేక యువత వలసలు వెళ్ళింది.
రాష్ట్రానికి నిరుద్యోగం అతి పెద్ద సమస్య. నిన్న చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు 50 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన బాబు చెప్పినట్టు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే… 5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే మిగతా వాళ్ల సంగతి ఏంటి?
ఉద్యోగాలు అని గతంలో మోడీ బీజేపీ ప్రభుత్వం కూడా మోసం చేసింది. 20 కోట్ల ఉద్యోగాలలో మనకు ఎన్ని వచ్చాయి? ఒక్క ఉద్యోగం ఇవ్వని మోడీ కి ఎందుకు బాబు మద్దతు ఇస్తున్నారు? రాష్ట్రంలో మీరు ఇచ్చే 20 లక్షలకు తోడు మరో 30 లక్షల ఉద్యోగాలు మోడీ ఇవ్వాలి.
బాబు కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. మోడీ, బాబు ఇద్దరు కలిసి కూర్చొని ఉద్యోగాల కల్పనపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేత పత్రం ఇవ్వాలి.
గత 10 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి తేల్చాలి.
జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేయాలి. లోకేష్ మోడీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారట. 21 మంది ఎంపీలు ఇస్తామని చెప్పి ఇచ్చారట. అయ్య లోకేష్ గారు… మీరు ఇచ్చిన మాట సరే…మోడీ ఇచ్చిన మాట ఏంటి? రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీలు అందరు మోడీకి ఊడిగం చేస్తూనే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో నిలబడి మోడీ చెప్పారు.
ఇచ్చిన మాట ఎక్కడ పోయింది? హోదా వచ్చి ఉంటే… పరిశ్రమల కోసం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. పోటీ పడి మరీ పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్ లో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 10 వేల పరిశ్రమలు వచ్చాయి. మరి హోదా మీద మోడీ ఇచ్చిన మాట ఎక్కడ పోయింది. పోలవరం నాది బాధ్యత అని మోడీ అన్నారు. రాజధానిని న్యూ ఢిల్లీ మించిన రాజధాని అన్నారు. మట్టికొట్టి పోయాడు తప్పితే ఒక్క రూపాయి లేదు. వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు అన్నారు..ఇవ్వలేదు. విశాఖ స్టీల్ కి ఒక్క క్యాపిటల్ మైన్ ఇస్తే మోడీకి జరిగే నష్టం ఏముంది? మోడీని నిలబెట్టి లోకేష్ అడగాలి. సూపర్ సిక్స్ పాలసీలు సరే…సూపర్ సిక్స్ పతకాలు ఎక్కడ పోయాయి. 20 లక్షల ఉద్యోగాలు అని అన్నారు…అంటే నిరుద్యోగ భృతి ఉన్నట్లా ? లేనట్లా ? నిరుద్యోగ భృతి మీద 2014 లోనే మీరు 2 వేలు ఇస్తామన్నారు.
ఇప్పుడు 3 వేలు అంటున్నారు. ఇంత వరకు భృతి పై జాడ లేదు.
తల్లికి వందనం నిధుల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద 15 వందలు అన్నారు… ఏమయ్యింది? ఉచిత సిలిండర్ల కు దసరా అన్నారు…దీపావళి అన్నారు… రేపు సంక్రాంతి అంటారేమో… ఇది చాలా తక్కువ బడ్జెట్ పథకం.. ఏడాదికి 2 వేల నుంచి 4 వేల కోట్లకు ఖర్చు అయ్యే పథకానికి నిధులు లేవా? ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యింది? జగన్ కి తెలియదు ఏమో… హర్యానా ఎన్నికలతో ఏపీని ఎలా పోలుస్తారు? ఇక్కడ ప్రజల నాడికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. హర్యానాలో ప్రజల నాడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఏపీలో ఫలితాలు అనుకున్నట్టే వచ్చాయి. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకున్నారు. లిక్కర్ విషయంలో జగన్ కి, బాబు కి పెద్ద తేడా లేదు. జగన్ హయంలో లిక్కర్ మాఫీయా తాడేపల్లి ప్యాలెస్ కి లింక్ ఉంది. బాబు హయాంలో నియోజక వర్గంలోని తమ్ముళ్ళ చేతుల్లో మాఫీయా ఉంది. ఇద్దరు దొందు దొందే. లిక్కర్ విషయంలో మొత్తం మాఫీయానే.