బీజేపీ-ఆరెస్సెస్ జగన్‌ను ఇంకా కాపాడతాయా?

రుషి కొండ మీద చక్కగా ఉన్న టూరిజం భవనాలను నేలకూల్చి.. జగన్ తన ఫ్యామిలీ కోసం ప్యాలెస్ కట్టుకున్నాడు. రుషికొండకు గుండు కొట్టాడు అని జనం అనుకున్నది. అదొక అంకం. అసలైంది ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బు రూ.500 కోట్లను లగ్జరీ కోసం వినియోగించాడు. గెలవడం పక్కా.. ఉషాకలో కాపురానికి ఎదురుండదని కలగన్నాడు.

పులివెందులలో మాదిరిగానే మిగిలిన 174 నియోజక వర్గాల్లో బీజేపీ సహకారంతో జనాన్ని భయభ్రాంతులకు లోను చేసి, రిగ్గింగ్‌ చేసి గెలవడం పెద్ద పని కాదని జగన్ భావించాడు. కానీ చంద్రబాబు.. బీజేపీ కి.. ఒక్క సీటుకు కూడా చాన్స్ లేకపోయినా 6 సీట్లు ఇచ్చి జగన్ అరాచకాలను చాలా వరకు తగ్గించగలిగాడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిను మార్చకపోవడం మినహా, కొన్ని అంశాల్లో బీజేపీ .. జగన్ వైపే నిలిచింది.

జగన్‌ను పెంచి పోషించింది ముమ్మాటికీ బీజేపీ-ఆరెస్సెస్ లే. చివరకు కమలం పార్టీకి దేశమంతా పరిస్థితులు అనుకూలంగా లేవని అర్థం కావడం వల్లే.. టీడీపీ తో పొత్తుకు సిద్ధపడింది. సెంట్రల్లో బీజేపీ కి సింగిల్‌గా మెజార్టీ వచ్చే పరిస్థితి ఉండింటే మోదీ.. చంద్రబాబుతో ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు కట్టే వాడు కాదు. 400 పార్ డైలాగ్ అనేది జనం చెవిలో పూలు పెట్టడానికి చెప్పిన మాట మాత్రమే.

బీజేపీ-ఆరెస్సెస్ .. నేరుగా జగన్‌తో పొత్తు పెట్టుకోవాలి. కానీ ఇద్దరివి మతపరమైన రాజకీయాలు. అందుకే పదేళ్ల పాటు రహస్య కాపురం చేశారు. ఇప్పటికి కూడా జగన్‌ను కాపాడ్డానికి బీజేపీ-ఆరెస్సెస్ ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఆయన మీద ఉన్న ఈడీ సీబీఐ కేసుల్లో కదలిక దాదాపుగా ఉండకపోవచ్చు.

– రావి రామ్మోహన్‌రావు