ధర్మవరం కి వస్తా

– ధర్మవరంలో చేనేత రంగం అభివృద్ధికి సహకరించండి.
– కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిని కోరిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

జూన్ 14 : చేనేతల కేంద్రమైన ధర్మవరాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుండి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్య కుమార్ యాదవ్ కు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో చేనేతలు తనపై ఎంతో నమ్మకంతో అండగా నిలిచి గెలిపించారని వారి రుణం తీర్చుకోవడానికి ధర్మవరంలో మార్కెటింగ్ వ్యవస్థ, టెక్స్టైల్స్ పార్క్, మెగా క్లస్టర్ మంజూరు చేసి పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు.

దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ధర్మవరంలో చేనేత రంగం అభివృద్ధి కోసం తాను తప్పకుండా సహకరిస్తానని, కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. అలాగే సత్య కుమార్ గారి కోరిక మేరకు అతి తొందరలోనే ధర్మవరం కి వస్తానని హామీ ఇచ్చారు.