అముదాల వలసలో తమ్మినేని సతీమణి రిగ్గింగ్ యత్నం
నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి కార్ల ధ్వంసం
విజయవాడ తూర్పులో పోలింగ్కు విఘాతం
దర్శిలో దౌర్జన్యాలు, దాడులు
తెనాలిలో ఓటరుపై వైసీపీ అభ్యర్థి దాడి
వై.పాలెంలో పోలింగ్కు ఆటంకం
శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిపై దాడి
ఎన్నికల ప్రధానాధికారికి దేవినేని ఉమ ఫిర్యాదు
అమరావతి, మహానాడు : రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనాకు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కారకులపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు సజావుగా జరిపించాలని కోరారు.
అముదాల వలసలో తమ్మినేని సతీమణి రిగ్గింగ్ యత్నం
ఆముదాలవలసలో తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ బూత్ ఆక్రమణలకు పాల్పడ్డారు. ఆమె తన అనుచరులతో కలిసి ఆమదాలవలసలోని 158, 159 బూత్లను ఆక్రమించి ఎన్నికల అక్రమాలకు తెరలేపారు. పోలింగ్ బూత్ల నుంచి టీడీపీ సానుభూతిపరులను బయటకు పంపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారి సతీమ ణి పట్టపగలే ఇలా పోలింగ్ బూత్లు ఆక్రమించి రిగ్గింగుకు పాల్పడటం దారుణం. ఆ పోలింగ్ స్టేషన్లకు అదనపు బలగాలు పంపాలి. పోలింగ్ అక్రమాలను వెంటనే నిలుపు దల చేసి శాంతియుత ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని కోరారు.
నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి కార్ల ధ్వంసం
నరసరావుపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఎక్కువమంది అనుచరులు, వాహనాలతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలుకు చెందిన మూడు కార్లను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసి టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. సెక్షన్ 144 అమలు చేయడంలో పోలీసులు వైఫ ల్యం చెందారు. చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలి. అక్కడ 144 సెక్షన్ సరిగ్గా అమలు అయ్యేలా చూడాలని కోరారు.
విజయవాడ తూర్పులో పోలింగ్కు విఘాతం
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు పోలింగ్ విఘాతం కలిగిస్తు న్నారు. ఆంధ్ర లయోలా కాలేజీ, జియాన్ స్కూలు పోలింగ్ స్టేషన్లలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేస్తూ ఓటర్లను భయభ్రాతులకు గురిచేస్తున్నారు. పోలీసులు వైకాపా కార్యక ర్తలను అదుపులోకి తీసుకోకపోగా వారి ఆగడాలను అడ్డుకోబోయిన టీడీపీ కార్యకర్త పూర్ణను అరెస్టు చేశారు. దేవినేని అవినాష్ ప్రోద్బలంతో కొంతమంది పోలీసు అధికా రులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే జోక్యం చేసుకుని అదనపు బలగాలను పంపి వైసీపీ రౌడీ మూకలను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు.
దర్శిలో దౌర్జన్యాలు, దాడులు
బొట్లపాలెం, ఎర్రబోయినపల్లె, తుమ్మపాడు గ్రామాల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలను తమ ఆదీనంలోకి తీసుకుని ఓటర్లను బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. దర్శి నియోజకవర్గానికి అదనపు బలగాలు పంపి శాంతియుతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెనాలిలో ఓటరుపై వైసీపీ అభ్యర్థి దాడి
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అనుచరులతో కలిసి గుంపుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడాన్ని ప్రశ్నించిన ఓటరుపై దాడి చేశారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ చేయి చేసుకున్నారు. సెక్షన్ 144 అమలు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. ఈ ఘటనను ప్రత్యేక కేసుగా పరిగణించి శివకుమార్, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సెక్షన్ 144 అమలు చేసి ఓటర్లకు రక్షణ కల్పించాలి.
వై.పాలెంలో పోలింగ్కు ఆటంకం
యర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం, సత్తకోడూరు, గంగవరం గ్రామాల్లో హల్చల్ చేస్తున్నారు. సత్తకోడూరులో వైసీపీ కార్యకర్తల కారణంగా పోలింగ్ నిలిచి పోయింది. పై పోలింగ్ బూత్ల వద్ద పోలీసు బలగాలు తక్కువగా ఉన్నాయి. పరిస్థితిని అదుపుచేయడం కోసం అదనపు పోలీసు బలగాలను పంపాలని కోరారు.
శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిపై దాడి
శ్రీకాకుళం అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గోండు శంకర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లను సందర్శిస్తుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ గూండాలను అదుపు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. దాంతో టీడీపీ అభ్యర్థి రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేయాల్సి వచ్చింది. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. వివక్షపూరితంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుం డా అదనపు పోలీసు బలగాలను పంపాలి.