-సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వ్యాజ్యం
-ఇంప్లీడ్ అయిన టీడీపీ తరపున న్యాయవాదులు
అమరావతి: రిటర్నింగ్ అధికారి నియమించిన గెజిటెడ్ అధికారుల సంతకం చేసి పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిని గుర్తిస్తే చాలు. వారి పేరు, హోదా, చిరునామా రాయకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. రెండురోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. సీనియర్ న్యాయవాది వీరరెడ్డి వాదిస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ ఈరోజు ఇచ్చిన వివరాలు తెలియజేస్తూ తెలుగుదేశం నాయకులు నలబోతు రామ కోటేశ్వరరావు, విశాఖపట్నం తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ తమ వాదనలు కూడా వినాలని ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. వారి తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, పదిరి రవితేజ వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తదుపరి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయమని అడగటానికి మధ్యంతర అర్జీ దాఖలు చేస్తామని వైకాపా తరపున న్యాయవాది కోరారు.