జోగి రమేష్ ఫ్లాట్లో వస్తువుల స్వాధీనం
పెనమలూరు, మహానాడు : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. గంగూరు ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్ అద్దెకు తీసుకున్నారు. అందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణ వస్తువులు, నగదు దాచి ఉంచారని సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లింది. తాళం వేసి ఉన్న ఫ్లాట్లోకి ప్రవేశించడానికి గంటన్నర సమయం పట్టింది. పెనమలూరు పోలీసుల సహకారంతో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిన అధికారులు అక్కడ పింగాణి సెట్స్, ప్లాస్కులు, ఇతర వస్తువులను గుర్తించారు. వీటితో పాటు వైకాపా అభ్యర్థి జోగి రమేష్ ఫొటో ముద్రించి ఉన్న టోపీలు, టీ షర్టులు, బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.