సీఎం సీరియస్
నేర స్థలికి హోంమంత్రి
బాపట్ల జూన్21,మహానాడు : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రైల్వే పట్టాలపై పడవేశారు. ఆ యువతిని అత్యాచారం చేసి హతమార్చినట్టు ఘటనా స్థలిలో ఆధారాలు కనిపిస్తున్నాయి. డెడ్ బాడీని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆమెను తీవ్రంగా హింసించి క్రూరంగా హతమార్చినట్టు స్థానికులు భావిస్తున్నారు. నేర స్థలిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. బాధిత యువతి నెల్లూరు జిల్లా వాసి సుచరితగా గుర్తించారు.
కదలిన యంత్రాంగం
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత హత్య కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు.
దర్యాప్తులో అలసత్వం లేకుండా జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపురుపాలేనికి హోంమంత్రి అనిత బయలుదేరారు. ఈ హత్యోందంతాన్ని సీరియస్ గా తీసుకోవాలని డీజీపీ తిరుమలరావును ఆదేశించారు.