పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

హైదరాబాద్‌, మహానాడు:  ఖరీఫ్‌లో రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసిందని, దానికి సరిపడా బీజీఐఐ విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం అధికారులను ఆదేశించారు. 2021లో 60.53 లక్షలు ఉన్న పత్తి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ 2023లో 45.17 లక్షలకు వచ్చిందని, అయినా ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశముందని దానికి తగ్గట్లు విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించా రు.

గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోగా ఈసారి 120 లక్షల ప్యాకెట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే రెండు దఫాలు సంబంధిత అధికారులు, విత్తన కంపెనీలతో సమావేశం జరిపి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి బీజీఐఐ(బోల్‌గార్డ్‌ ఐఐ) పత్తి విత్తన ప్యాకెట్‌ గరిష్ఠ ధరను రూ.864 నిర్ణయించిందని, ఏ డీలరైనా అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమని, విధుల్లో అలస త్వం వహించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తం గా జిల్లాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అమ్మకాలను పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.