స్వాతంత్య్రానికి పూర్వం 1936 బ్రిటీష్ పాలన రోజులవి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయం. గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, భోగరాజు పట్టాభి సీతారామ య్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య ‘‘ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య’’ను సభ దృష్టికి తెచ్చారు. ‘‘పట్టాభీ నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం.. ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా మద్రాసీలు కదా? అని అన్నారు గాంధీ గారు ఎగతాళిగా! వెంటనే పట్టాభి సీతారామయ్య తన జేబులో నుంచి ‘‘అణా కాసు’’ను తీసి గాంధీజీ దీనిపై ‘ఒక అణా’ అని అధికార భాష అయిన ఆంగ్లం, హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ, తెలుగులోనూ రాసి ఉంది. అది కూడా బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం (అప్పటికీి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు). నాణెంపై తెలుగుభాషలో ఒక అణా అని ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే? అంటూ చురక వేశారు. దాంతో గాంధీ గారితో పాటు కొంతమంది తెలుగు మాతృభాష కాని వారు కూడా ఆశ్చర్యపోయారు. అప్పట్లోనే తెలుగు భాషకు బ్రిటిష్ వారు పట్టం కట్టారు అన్న దానికి ఇది ఒక నిదర్శనం.