శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

-జిల్లాలో రౌడీషీటర్లు, పాతనేరస్తులపై నిఘా
-సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌
-కార్డన్‌ సెర్చ్‌తో విస్తృత తనిఖీలు
-ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశం

గుంటూరు: జిల్లాలో రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు, కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తూ ఎలాం టి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

తనిఖీలలో నెంబర్‌ లేని, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనాలు, ఆటోలు, ఇతర వాహనాలపై జరిమానాలు విధించాలని అవసరమైతే ఎంవీఐకు పంపి జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్పెషల్‌ పార్టీ సిబ్బంది సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి విస్తృతంగా కార్డన్‌ సెర్చ్‌ అపరేషన్‌ నిర్వహించి మద్యం, మందు గుండు సామగ్రి, లోకల్‌ వెపన్స్‌ అక్రమ నిల్వలపై ఆరా తీస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు.