ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయి
టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్
ఢిల్లీ: రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని టీడీపీ నేత కనక మేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఎన్డీఏ పక్షాల రెండో సమావేశం జరిగిందని, అనంతరం ఎంపీలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 9న ప్రమాణ స్వీకా రం చేస్తారని వివరించారు. అంతకంటే ముందు ఎన్డీఏ నేతను ఎన్నుకుంటామని తెలిపారు.
కేంద్రం ముందు మీరు ఎలాంటి డిమాండ్లు ఉంచుతారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ దానికిప్పుడు సమయం కాదని పేర్కొన్నారు. తాము ఎన్డీఏ భాగస్వాములమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి తీసుకోవాల్సినవి చాలానే ఉన్నాయని, అదంతా పద్ధతి ప్రకారం జరుగుతుందని తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, దానిని పునర్నిర్మించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సమస్యా లేదని తేల్చిచెప్పారు.