– మంత్రి సత్యకుమార్
హైదరాబాద్, మహానాడు: తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) బలోపేతం, రాబోవు ఎన్నికల్లో పార్టీని సొంతంగా అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్లో ఆదివారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకీ శ్రీనివాస్ స్వగృహంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన వీక్షించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో బీజేపీని పటిష్ఠం చేయడం కోసం పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలన్నారు. ప్రధాని మోదీ నేతృతంలో దేశం వేగంగా పురోగమిస్తోందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే మారనుందన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కలలను సాకారం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలుగు భాషా ప్రాశస్త్యం, ప్రాముఖ్యతను పొగడటం, తెలుగులో తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం అభినందనీయమన్నారు. దేశ ప్రగతి పథంలో సాధించిన విజయాల్లో కొన్నింటి గురించి ప్రధాని ప్రస్తావించారని, అంతరిక్ష రంగంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, వాటిని వినియోగించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రధాని చెప్పిన విషయాలను, సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను సత్యకుమార్ యాదవ్ కోరారు.