ఆదిలాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నార ని, ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల రుణం తీసుకోవాలని తాము అధికారంలోకి రాగానే.. డిసెంబర్ 9న మాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఆ తర్వాత మాట మార్చారని పేర్కొన్నారు.
వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేవుళ్లపై ఒట్టు పెట్టి.. ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు అందరికీ మాఫీ కాలేదన్నారు. తొలుత రూ.49 వేల కోట్లు అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ తర్వాత రూ.40 వేల కోట్లు అని చెప్పారని, మరోసారి రూ.31 వేల కోట్లు అని చెప్పారని, కానీ బడ్జెట్లో పెట్టింది మాత్రం రూ.26 వేల కోట్లు మాత్రమే అన్నారు. ఆగస్ట్ 15 నాటికి కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని జోగు రామన్న ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.