‘పచ్చ కామెర్లోడి’లా ప్రధాని మోదీ తీరు!

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా విమర్శ

విజయవాడ, మహానాడు: పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుంది ప్రధాని మోదీ తీరు. ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేది బీజేపీ. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేది బీజేపీయేనని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా విమర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో ఏమన్నారంటే.. విభజన రాజకీయాలు చేసేది బీజేపీ. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ బీజేపీ. మత రాజకీయాలకు జన్మస్థలం బీజేపీ. మతాన్ని కవచంలా అడ్డుపెట్టుకుని దర్జాగా దేశాన్ని దోచుకుంటూ.. దోస్తులకు సంపదను దోచిపెడుతూ.. కాంగ్రెస్ ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోడీ అనడం, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుంది హర్యానాలో బీజేపీ విజయం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా.. ప్రజల మనసులో బలంగా నాటిన ప్రేమ, ఐక్యత సందేశం క్రమంగా ఉద్యమంగా, ఉప్పెనగా మారుతోందని బీజేపీకి తెలుసుకోవాలి.

కాంగ్రెస్ మనుషుల్ని, వారి మనసులను గెలిచిందని గ్రహించాలి. నఫ్రత్, మొహబ్బత్ కు మధ్య జరిగిన యుద్ధంలో ప్రేమనే గెలిచింది. జమ్మూకాశ్మీర్ లో తెరుచుకున్న “మొహబ్బత్ కి దుకాణ్” లు రేపు దేశం మొత్తం తెరుచుకుంటాయి. మోడీ హఠావో..దేశ్ బచావో నిజమవుతుంది. 10 ఏళ్లుగా దేశం వెలుగుతుందని పచ్చి అబద్ధాలు చెప్తున్న మోడీ.. “విశ్వగురు కాదు.. విష పురుగు” అని ప్రజలకు అర్థం అవుతుంది.

విద్వేషాన్ని పెంచేది మోడీ..ప్రేమను పంచేది రాహుల్ అని స్పష్టం అవుతుంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తుంటే… కుల, మతాల మధ్య విభజన తెచ్చి ఊచకోత కోస్తుంటే… ఎదిరించిన గొంతుకలను నక్సల్స్‌, టెర్రరిస్టులు, హిందూ వ్యతిరేకులుగా పోల్చుతుంటే… హక్కుల పరిరక్షణకు, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని దేశం నమ్ముతుంది.

ఈ నమ్మకమే 2029లో దేశాన్ని కాంగ్రెస్ నిలబెడుతుంది. ప్రధానిగా రాహుల్ గాంధీని దేశం చూస్తుంది. అన్ని వర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ అందించేది ఆపన్న హస్తం, వాడిపోవటానికి అతి చేరువలో ఉన్నది కమలం.