– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: రతన్ టాటాకి శాసన సభ్యుడు కన్నా లక్ష్మి నారాయణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయం. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరు. నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్గా చేసిన రతన్ టాటాకి మరణం లేదు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ అందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారు..రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ, పట్టణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.