Mahanaadu-Logo-PNG-Large

కూటమికి రాష్ట్రంలో భారీ విజయం తథ్యం

• ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారు
• దేశానికి మరోమారు మోదీ పాలన అవసరం
• వారణాసిలో విలేకరులతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని ఓటర్ల తీర్పు స్పష్టంగా ఇచ్చారు. భారీ మెజార్టీతో ఎన్టీయే కూటమి రాష్ట్రంలో గెలవబోతోందని, ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పును ఇచ్చార’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించేలా పాలన రాబోతోందన్నారు.

వారణాశి లోక్ సభ నియోజకవర్గానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపేందుకు, ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ సతీసమేతంగా సోమవారం సాయంత్రం వారణాసి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ ‘‘ప్రధానిమోదీ పై అపార గౌరవంతో ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలనే సంకల్పంతో ఆయనకు మద్దతు తెలియజేసేందుకు వచ్చాను. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ దూసుకువెళ్తోంది. దేశ అభ్యున్నతికి ఈ కీలక సమయంలో దేశ ప్రజలంతా తోడుగా ఉంటారని భావిస్తున్నాను. రాష్ట్రంలోనూ ఎన్టీయే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగమనానికి తగిన విధంగా పని చేస్తుంది. ప్రజాపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విజేతగా నిలుపుతాం’’ అన్నారు.