ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన
జిల్లాల వారీగా అధికారులకు సూచనలు
అమరావతి: ఈ నెల 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించేందుకు, ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందు కు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీపీబీఎస్ / పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు, ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన తదితర వివరాలను తెలుసుకున్నారు.
స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం, మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జాయింట్ సీఈవో ఎస్.వెంకటేశ్వరరావు కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.