Mahanaadu-Logo-PNG-Large

తలసాని సోదరుడు శంకర్‌యాదవ్‌కు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రకు తరలివచ్చిన పార్టీల నేతలు, అభిమానులు
అన్న భౌతికకాయాన్ని చూసి శ్రీనివాసయాదవ్‌ కన్నీరు

హైదరాబాద్‌: మాజీమంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరుడు, మోండా మార్కెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తలసాని శంకర్‌ యాదవ్‌ అంత్యక్రియలు మంగళవారం వేలాదిమంది సమక్షంలో జరిగాయి. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజా మున మరణించగా మంగళవారం కుటుంబసభ్యులు బన్సీలాల్‌పేటలోని గ్రేవ్‌ యార్డ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నీ తానై అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పర్యవేక్షించారు. తన అన్న పార్థివదేహాన్ని చూసి పలుమార్లు కన్నీటి పర్యంతమయ్యారు. వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని రాధికా కాలనీలో శంకర్‌యాదవ్‌ నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో కుటుంబసభ్యులు, బంధువులు, ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నాయకులు, అధికారులు వేలాదిగా పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర మోండా మార్కెట్‌కు చేరుకున్న సమయంలో మోండా మార్కెట్‌లోని పలువురు వ్యాపారు లు, మహిళలు నివాళులర్పించారు. అనంతరం శంకర్‌యాదవ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు ముందు రాధికా కాలనీలోని నివాసంలో శంకర్‌ యాదవ్‌ పార్థివదేహానికి మల్లారెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి, వివేక్‌, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌ రెడ్డి, వి.హన్మంతరావు, మర్రి శశిధర్‌ రెడ్డి, కాసాని జ్ఞాజేశ్వర్‌ ముదిరాజ్‌ తదితరులు నివాళులర్పించారు.

అంతిమయాత్రలో కేటీఆర్‌..

అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు జగదీశ్వర్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, దానం నాగేందర్‌, మాజీ జైపాల్‌ యాదవ్‌, అంజయ్య యాదవ్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, అనిల్‌కుమార్‌ కూర్మాచలం, చిరుమళ్ల రాకేష్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సర్వే సత్యనారాయణ, రోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.