బుడమేరు పూర్వవైభవానికి యాక్షన్‌ ప్లాన్‌

– మంత్రి నారాయణ

విజయవాడ, మహానాడు: విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి ఖండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ తో పాటు బుడ మేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. వరద తగ్గిన చోట సాయంత్రానికి పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. బుడమేరు ప్రవాహానికి ఉన్న ఆటంకాలను అధిగమించడంపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే.. 10 రోజులపాటు సీఎం తో పాటు మంత్రులు, అధికారులు కష్టపడి వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వరద తగ్గిపోయింది. ఐదు ప్రాంతాల్లో సాయంత్రానికి సాధారణ పరిస్థితి తీసుకొస్తాం. మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తాం. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు. బుడమేరు ఉండాల్సిన విస్తీర్ణం కంటే చాలా వరకూ కుచించుకుపోయింది. ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం.