ఎన్నికల ప్రధానాధికారికి విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు
హైదరాబాద్, మహానాడు : ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి…శ్రీరామచంద్రుడు, సీతమ్మపై చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తప్పుపడుతోంది. అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి బియ్యంతో తయారుచేసి పంచారని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన రేవం త్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజుకు వీహెచ్పీ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ శ్రీరామ్ అంటే ఉద్యోగం వస్తుందా? పొలాలకు నీరు వస్తాయా? అంటూ వ్యంగంగా ఎగతాళి చేశారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా విచక్షణ కోల్పోయి హిందుత్వంపై దూషణలు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సహకార్యదర్శి రావినూతల శశిధర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మప్రసార్ ప్రాంత సహ ప్రముఖ్ సుభాష్ చందర్, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పాల్గొన్నారు.