ఆల్ ది బెస్ట్!

– పదవి ఒక బాధ్యత… ఆ బాధ్యతను మరిచిపోవద్దు
– కొత్త చైర్మన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, మహానాడు: పదవి ఒక బాధ్యతని… ప్రజాసేవ అనే ఆ బాధ్యతను ఎవరూ మరిచిపోవద్దని కొత్తగా పదవులు చేపట్టిన నేతలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు బుధవారం సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యత. మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులు అని గుర్తు పెట్టుకోవాలి. ప్రజలకంటే మనం ప్రత్యేకం అని భావించకూడదు…. మన నడవడిక, తీరు ప్రజలు గమనిస్తారు.

ప్రతి కదలికా, మాటా, పని గౌరవంగా, హూందాగా ఉండాలి. ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చాం. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించాం. మంచి ఫలితాలు వచ్చాయి. నేడు నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించాం. ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగాం. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. లిస్టులు ఉంటాయి. కొందరు నాయకులు తొందర పడుతున్నారు…ఇది మంచి పద్దతి కాదు. మన పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ టిక్కెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంత వరకు అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి మొదటి లిస్టులో ముందుగా అవకాశాలు ఇచ్చాం….మీకు అవకాశాలు వచ్చాయి అంటే…మిగిలిన వారు పనిచేయలేదు అని కాదు. అర్హత లేదు అని కాదు. జైలుకు వెళ్లిన వాళ్లు, ఆస్తులు కోల్పోయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారు.

పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లు ఉన్నారు…ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలి అనే విషయంలో స్పష్టంగా ఉన్నాం. కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించం. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించాం. జనాభా దామాషా లెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మీ విభాగాలపై ముందుగా బాగా స్టడీ చేయండి. ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే విషయాలపై లోతుగా కసరత్తు చేయండి. పెట్టుబడుల రాబడట్టడంలో పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ఏపీఐఐసీ పాత్ర కీలకం. మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావచ్చు. మనం పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే…. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు వాటిని కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసింది. పరిశ్రమలు వస్తే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి. కానీ జగన్ ఇళ్ల స్థలాల పేరుతో వాటిని ఇచ్చారు.

ఆర్టీసీని నిలబెట్టాలి.. ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి…. కార్గో పెంచాలి. నేతలకే కాదు. ట్రాక్ రికార్డుల ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కూడా కార్పొరేషన్ లలో అవకాశాలు ఇచ్చాం. బాగా పనిచేయండి….ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. కష్టపడి పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. మనకు వచ్చిన విజయాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరు పని చేయాలి. సింపుల్ గవర్నమెంట్… ఎఫెక్టివ్ గవర్నెర్స్ అని నేను, పవన్ కల్యాణ్‌ చెప్పాం. అదే అంతా పాటించాలి. 15 రోజుల్లో వరద సాయం అందించాం. మళ్లీ బాధితులను నిలబెట్టే ప్రయత్నంచేశాం. ఇది మన విధానం. దీనికి అనుగుణంగా మీరు పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి, సమన్వయంతో మీరంతా పనిచేయాలని కోరుతున్నా. మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలి…. ఆల్ ది బెస్ట్!