24 గంటలపాటు విలవిలలాడిన గిరిజన యువకుడు
ప్రాణాపాయస్థితిలో హైదరాబాద్ నిమ్స్కు తరలింపు
మూడుగంటలు శస్త్రచికిత్స చేసి కాపాడిన వైద్యులు
హైదరాబాద్: ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన ఓ గిరిజన యువకుడికి నిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, కార్డియో థెరపిక్ విభాగాధిపతి అమరేశ్వరరావు, సీనియర్ వైద్యుడు గోపాల్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూర్ ప్రాంతాని కి చెందిన సోది నంద(17) అనే గుత్తి కోయ తెగకు చెందిన యువకుడు గురువారం స్థానిక అడవిలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు బాణం ఛాతీలో దిగింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనల తో వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు.
మూడుగంటల పాటు శస్త్రచికిత్స
వైద్యులు తొలుత సీటీ స్కాన్ తీశారు. ఊపిరితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లు గుర్తించారు. అప్పటికే భారీగా రక్తస్రావమైంది. దీంతో ఒకవైపు రక్తం ఎక్కిస్తూనే మూడు గంటల పాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు. అది దిగిన చోట రక్తస్రావమై గడ్డకట్టడంతో ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. ఆ యువకుడు సొంతంగా బాణాన్ని తీసే ప్రయత్నం చేసి ఉంటే మరింత రక్తస్రావమై పరిస్థితి చేజారిపోయేదని వివరిం చారు. మానవీయ కోణంలో ఈ చికిత్సను నిమ్స్ పూర్తి ఉచితంగా చేసిందని, కోలుకున్న వెంటనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన అమరేశ్వరరావు బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు.