పిఠాపురం సి.హెచ్.సి.లో వైద్యులు, సిబ్బంది నియామకం

• ఎక్స్ రే యూనిట్ పునరుద్ధరణ
• ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి..అధికారులతో సమీక్ష

పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారుల బృందాన్ని పిఠాపురం నియోజకవర్గానికి పంపించి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై పరిశీలన చేయించి నివేదికలు పరిశీలిస్తున్నారు.

ఇందులో భాగంగా పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి.)లో వైద్యులు, సిబ్బంది కొరత, ఎక్స్ రే యూనిట్ పని చేయకపోవడాన్ని గుర్తించారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్, డి.ఎం.అండ్ హెచ్.ఓ.లతో చర్చించారు. తక్షణమే పిఠాపురం సి.హెచ్.సి.లో వైద్యులను, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.

నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి అయిన సి.హెచ్.సి.లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ లను పిఠాపురం సి.హెచ్.సి.లో నియమించారు.

ముగ్గురు స్టాఫ్ నర్సులను, ఒక జనరల్ డ్యూటీ అటెండెంట్ లను నిర్ణయించారు. అదే విధంగా ఎక్స్ రే యూనిట్ ను పునరుద్ధరించారు. ఈ యూనిట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు.