నంద్యాల, మహానాడు: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ నిలుచుని ఉండగా కారుతో దుండగులు ఆయనను ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు. గతంలో నంద్యాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.