సాప్ట్ వేర్ ఉద్యోగులకు… సాప్ట్ గా ద్రోహం

-ఇద్దరి ఆత్మహత్యాయత్నం వెనుక నిజాలెన్నో ?
-పెద్ద మిస్టరీ …  వెలుగులోకి ఆర్థిక మోసం
-పోలీసులకు పెద్ద టాస్క్….
-తెరమీదకు రూ.49 కోట్ల లావాదేవీలు ?
– బహదూర్  

అమరావతి, మహానాడు : బందరులో అలజడి సృష్టించిన ఇద్దరు సాప్ట్ వేర్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం తుపాను ఇప్పుడు వడ్లమన్నాడు కేంద్రంగా సుడులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో ఇక్కడే తీరం దాటనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆత్మహత్యయత్నం ఎపిసోడ్ లో మూడో కృష్ణుడి పాత్ర వెలుగు చూస్తోంది. ఈ డీల్ రూ.25 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.49 కోట్లకు చేరింది. ఇంత సొమ్ము లావాదేవీలు ఎలా జరిగాయి? ఇందులో సూత్రధారులు, పాత్రధారుల పరిస్థితి ఏమిటి? తెలుసు కోవాలంటే.. నరాలు తెగే సస్పెన్స్ తప్పదు.

కేరళకు చెందిన ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో పెట్టుబడి సేకరించిన సాప్ట్ వేర్ ఉద్యోగులు… కజికిస్థాన్ లో పని చేసి విదేశీ వ్యాపారానుభవంతో వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. ఆక్వా ప్రొడక్ట్సు ఎగుమతుల్లో లావాదేవీలు బాగానే జరుగుతున్నాయి. కనీసం 20 మందికి ఉపాధి లభించింది. అకస్మాత్తుగా సాప్ట్ వేర్ ఉద్యోగులకు చెల్లింపులు నిలిచిపోయాయి. మూడో భాగస్వామి అజ్ఞాత వాసంలోకి వెళ్లిపోయాడు. పక్కా ప్లాన్ తో  తన బంధువుల పేరిటే ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన వడ్లమన్నాడు పాత్రధారి సాప్ట్ వేర్ ఉద్యోగులను సాప్ట్ గా దెబ్బ కొట్టాడని .. కనీసం మాట్లాడటానికి కూడా స్పందించక పోవటంతో… తాము తెచ్చిన సొమ్మును రికవరీ చేయలేమనే ఆందోళనతోనే సాప్ట్ వేర్ ఉద్యోగులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని ఓ వాదన వినిపిస్తోంది.  కానీ… వడ్లమన్నాడు వ్యక్తి మాత్రం కేవలం చెరువుల నిర్వహణ, రొయ్యల ఎగుమతుల్లోనే పాత్రధారి అని మరో వాదన తెరమీదకు వచ్చింది.

అదొక ఫేక్ కంపెనీ అట
సాప్ట్ వేర్ ఉద్యోగులు పెట్టుబడి పెట్టిన కంపెనీ ఓ సూటుకేసు కంపెనీ అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భీమవరం కేంద్రంగా ఈ కంపెనీ చెలామణి అవుతోందట. నెట్ లో పరిశీలిస్తే.. ఆ కంపెనీ యజమాని ఫోటో కూడా ఫేక్ అనే సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ కంపెనీని నిర్వహించిందెవరు? వడ్లమన్నాడు సూత్రధారా? లేక సైబర్ మోసగాడా? అదే జరిగితే వడ్లమన్నాడు వ్యక్తి వ్యాపార లావాదేవీలు ఎలా నిర్వహించాడో ,,,, అర్థం కాని మిస్టరీ. ఇక ఆత్మహత్యకు యత్నించిన స్నేహితులూ పక్కా ప్లాన్ అమలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెంగళూరులో ఓ సాప్ట్ వేర్ కంపెనీలో విధులు నిర్వహించిన వీరద్దరూ అకస్మాత్తుగా కోట్లకు ఎలా పడగలెత్తారు? బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం, ముదినేపల్లి మండలంలో  సింగరాయపాలెంలో ఆస్తులు ఎలా సమకూర్చుకున్నారు?  అసలు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులేంటీ?

అదే పెద్ద మిస్టరీ .. సస్పెన్స్
ఆత్మహత్యకు ప్రయత్నించటం ఒక నేరం. ఆత్మహత్యను ప్రేరేపించటం మరో నేరం. వీటి వెనుక చీటింగ్ ఇంకో నేరం. వెరసి మచిలీపట్నం పోలీసుల ముందు పెద్ద టాస్క్ వికటాట్టహాసం చేస్తున్న మాట వాస్తవం. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మరో సన్నిహితుడు ఉన్నారు. అతడి నుంచే ఆక్వా వ్యాపారానికి పెట్టుబడి సమీకరించినట్టు భోగట్టా. ఇచ్చిన పెట్టుబడికి .. ఇంత వరకూ రికవరీ లేకపోవడంతోనే మూడో స్నేహితుడు వీరిద్దరిపై పెట్టుబడి రికవరీకి సర్వసాధారణంగా ఒత్తిడి చేయగా… ఈ ఉపద్రవం నుండి తప్పించుకునేందుకే ఆత్మహత్యాయత్నం పావుగా వినియోగించారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. వీరిద్దరిలోనూ కొంత తేడా కనిపిస్తోంది. బీరులో అత్యధికంగా గడ్డి మందును కలిపి.. తాను మాత్రం తక్కువ మోదాదులో బీరు తాగిన వ్యక్తి … అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉంటే… ఇంకో వ్యక్తి పరిస్థితి విషమంగా మారినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి వివరాలు కోసం ఎదురు చూద్దాం