పెదకూరపాడు: పల్నాడు జిల్లా పెదకూరపాడు కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న భాష్యం ప్రవీణ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా అశేష ప్రజానీకం మధ్య ర్యాలీ గా అమరావతి పట్టణం అంబేద్కర్ కూడలి నుంచి బయలుదేరారు. అమరావతి అంబేద్కర్ విగ్రహ కూడలి నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ లింగాపురం, పరస, 75 తాళ్లూరు మీదు గా పెదకూరపాడు అంబేద్కర్ విగ్రహ కూడలి, పెదకూరపాడు తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, కూటమి నేతలు బోనబోయిన శ్రీనివాస్, ఎం.ఎ.షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి భాష్యం ప్రవీణ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.