-పోలీసుల అప్రమత్తం…విస్తృతంగా తనిఖీలు
-భట్టి విక్రమార్క నివాసంలో డాగ్స్క్వాడ్ బృందం
-ఫోన్ చేసిన వ్యక్తి కోసం ఆరా
హైదరాబాద్, మహానాడు
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైద రాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకుని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్కుమార్ తన సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి చాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణు వునా డాగ్ స్క్వాడ్ బృందం, పోలీసులు తనిఖీలు చేశారు. భట్టి విక్రమార్క కాన్వా య్, కుటుంబసభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించా రు. ఆ తర్వాత ప్రజాభవన్లో ఉన్న అమ్మవారి ఆలయంలో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఫోన్ చేసిన వ్యక్తి కోసం అన్వేషణ
ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పడ్డారు. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తం గా ఒక్కసారిగా కలకలం రేగింది.