హైదరాబాద్, మహానాడు : అవినీతి సంపాదనతో ఆనాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత లేదన్నారు.
సీఎల్పీ మీడియా పాయింట్లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీ నేత నిరంజన్ రెడ్డి లేఖ రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి కృష్ణానదిని కూడా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రధానమంత్రి పదవి కాళ్ళ దగ్గరకు వచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వదులుకున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు అంబేద్కర్ ఆశయాలను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం లో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన సాగుతుందనని కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. ఆ రోజు 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అంబేద్కర్, రాజ్యాంగంపై వాళ్లకు విలువలు ఉంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది వారే కదా అని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే కూలిపోతుందన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ను కూల్చాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసమే తమ ప్రయత్నమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.