విశాఖలో సీబీఐ దాడులు.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

విశాఖపట్నం, మహానాడు: ఢిల్లీలో నమోదైన సైబర్‌ నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్న విశాఖకు చెందిన ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. విశాఖ నగరంలోని ఎండాడలో నివాసం ఉంటున్న అక్షయపత్వాల్, ధీరజ్‌జోషి, హిమాన్షుశర్మ, పార్త్‌బాలి, పి.నవీన్‌చంద్ర పటేల్‌ స్థానిక బిర్లాజంక్షన్‌ వద్ద ఉన్న ఓ కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నారు. వీరు కొంతకాలంగా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతూ.. పలువురి నుంచి డబ్బు కాజేస్తున్నారు. దీంతో సీబీఐ.. ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకుంది.

నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. తర్వాత వారిని సీబీఐ తన కస్టడీలోకి తీసుకుంది. నగరంలో ఉన్న పలు కాల్‌సెంటర్లలోనూ తనిఖీలు నిర్వహించి, మరి కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.