బుడమేరు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

– గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు.

అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు మంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు కాలువపై పంటుపై ప్రయాణించి అవతలి గట్టుకు చేరుకుని ముంపు ప్రభావంపై పరిశీలన జరిపారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే పనులపై సమీక్ష చేశారు. అనంతరం కేసరపల్లి వంతెన వద్ద బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించారు.

బుడమేరు డ్రైన్లో వరద ప్రవాహం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అక్కడి నుంచి మధురానగర్ వెళ్లిన ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరుకైన ప్రాంతంలోకి వెళ్లి మరీ అక్కడ పరిసరాలు పరిశీలించారు. అక్కడ నుంచి దేవినగర్, పుసుపుతోట, సింగ్ నగర్ గవర్నమెంట్ ప్రెస్ పరిధిలో పర్యటించారు.

ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితి, భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. దేవీనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జిపై పర్యటనలో ఉన్న సమయంలోనే ట్రైన్ వచ్చింది. దీంతో ఆ సమయంలో సీఎం పక్కన ఉన్న ర్యాంప్ పైకి వెళ్లారు. ట్రైన్ వెళ్లిన తర్వాత అక్కడ నుంచి కదలిలారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.